సుఖేశ్ లేఖ‌పై కవిత రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 4 |
సుఖేశ్ లేఖ‌పై కవిత రియాక్షన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నాపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు.

అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు.

దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం అన్నారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్‌యస్ పార్టీ‌పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలి.. జాగ్రత్త పడాలన్నారు.

తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఎంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ మీద కక్ష్యతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుందన్నారు. నా మీద బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..! జై తెలంగాణ... జై భారత్ అన్నారు.

Also Read...

MLC కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉంది: సుకేశ్ లాయర్

Next Story